తన నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ కోర్టుకెక్కారు కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క . నిధుల మంజూరులో జిల్లాకు చెందిన మంత్రి జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె దుయ్యబట్టారు.
నిధుల విడుదలకు సంబంధించి కోర్టుకెక్కారు కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క. తన నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వున్నందునే తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని సీతక్క పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ నిధుల మంజూరులో జిల్లాకు చెందిన మంత్రి జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె దుయ్యబట్టారు. జిల్లా మంత్రి ఆమోదంతోనే నిధులు మంజూరు చేయాలన్న జీవోను కొట్టివేయాలని సీతక్క ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది హైకోర్ట్.
ఇకపోతే.. ములుగు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన వేళ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలను పోలీసు స్టేషన్లో ఉంచడంపై.. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వస్తే ఎలా అని ప్రశ్నించారు.
ALso Read: ప్రజాస్వామ్యంలో ఉన్నమా?.. పాకిస్తాన్లో ఉన్నమా?: మంత్రి హరీష్ పర్యటన వేళ పోలీసులపై సీతక్క ఫైర్..
‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా?’’ అని సీతక్క ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను, ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్లు చేశారని అన్నారు. మంత్రి వస్తున్నప్పుడు వినతిపత్రం కూడా అందజేసే స్వేచ్ఛ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి పాల్గొంటున్న మీటింగ్ ప్రజాధనంతో పెడుతున్నారని.. కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అయితే పార్టీ మీటింగ్ అయితే తాము పట్టించుకునే వాళ్లం కాదని.. అది ప్రజల సొమ్ముతో పెడుతున్న మీటింగ్ అని అన్నారు
