రాష్ట్రాన్ని ప్రమాదకరమైన వ్యక్తి పాలిస్తున్నాడు: కేసీఆర్పై భట్టి ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రాన్ని ప్రమాదకరమైన వ్యక్తి పాలిస్తున్నాడని కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టుల విషయమై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నాలుగు మాసాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం కొత్త నాటకానికి తెర లేపినట్టుగా మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
ప్రాజెక్టులపై ప్రజలకు చాలా విషయాలు తెలియాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఖజానాను దోపిడి చేస్తున్న నువ్వే పెద్ద సన్నాసివి అంటూ మల్లు భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తావని ఆయన ప్రశ్నించారు. రూ. 80 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడ ఎకరం కూడ తడపలేదన్నారు.పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తే 11 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు.