టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జైలుకు వెళ్లొచ్చిన వాళ్లతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ చురకలు వేశారు. 

టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డిపై (revanth reddy) తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) . జైలుకు వెళ్లొచ్చిన వాళ్లు నీతులు చెబుతున్నారని.. వారితో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని తాను అధిష్టానాన్ని కోరానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల్ని, తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టి .. వాళ్ల కింద పనిచేయమని చేయమంటే మా మనసు ఒప్పుకోవడం లేదని ఆయన అన్నారు. మనస్తాపంతోనే మూడేళ్లు ఇంట్లో కూర్చున్నానని.. ఎక్కడా కాంగ్రెస్ ను విమర్శించలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ వ్యక్తి మీద నిందలు వేయలేదని.. ఓపికతో కూర్చున్నామన్నారు. 

అంతకుముందు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. KCR కుటుంబంపై తాను రాజీలేని పోరాటం చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపంచారు. తమ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాలల్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా తానే ఏ నిర్ణయం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. TRS నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి వివరించారు. 

ALso Read:సొంత నేతలపై దూషణలు.. ప్రత్యర్ధి పార్టీపై పొగడ్తలు, ఆయనది పూటకో మాట : కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి చురకలు

తాను గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన మాట వాస్తవమేనన్నారు.కానీ, బీజేపీలో చేరిక గురించి ఎప్పుడూ కూడా ప్రకటించలేదన్నారు. తనకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే తాను కొన్ని మాటలు మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. తాను రాజీనామా చేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు.

తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు. టీఆర్ఎస్ ఉసిగొల్పితే ఎన్నికలకు వెళ్లబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. అమిత్ షాను కలిసినందున తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ కు చెందిన మీడియాలో ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తనను గెలిపించిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన తెలిపారు. ఏం చేసినా కూడా తాను తన నియోజకవర్గ ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాల వల్ల పార్టీ బలహీనపడిందన్నారు.