కాంగ్రెస్ అధిష్టానంపై ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్పై జగ్గారెడ్డి ఫైరయ్యారు. యూత్ కాంగ్రెస్ వాళ్లు వెంటాడితే నువ్వు తిరగలేవని.. ఎవరో ఒకరు వచ్చి నీ ఒళ్లు పగలగొడతారని వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల కాంగ్రెస్ (congress) నాయకత్వంపై టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే బాల్క సుమన్ (balka suman) వ్యాఖ్యలు చేయడం పట్ల టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (jagga reddy) కౌంటరిచ్చారు. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడని, కానీ ఒక్కసారి ఓడిపోతే కనుమరుగై పోతాడని ఆయన హెచ్చరించారు.
నీకు రాహుల్ గాంధీ (rahul gandhi) మీద వ్యాఖ్యలు చేసేంత దమ్ముందా? నువ్వెంత, నీ బతుకెంత? అంటూ ఫైరయ్యారు. రాహుల్ గాంధీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పులేదు అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. పోలీసులు ఉంటే నిన్నెవరూ ఏమీ చేయలేరనుకుంటున్నావా... యూత్ కాంగ్రెస్ వాళ్లు వెంటాడితే నువ్వు తిరగలేవు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఎంతసేపు ఉంటారు? ఎవరో ఒకరు వచ్చి నీ ఒళ్లు పగలగొడతారు అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయంగా లబ్ది పొందింది టీఆర్ఎస్ నేతల కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కానీ ప్రజలకు రిజర్వేషన్లు, రుణమాఫీ , ఉద్యోగాలు వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన గుర్తుచేశారు. బాల్క సుమన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని.. తెలంగాణ వచ్చింది కాబట్టే అతను ఎంపీ, ఎమ్మెల్యే అయ్యాడని జగ్గారెడ్డి అన్నారు.
