మునుగోడులో పార్టీ గెలుపు కోసం పనిచేస్తా.. ఆ విషయంలో నో కామెంట్స్: జగ్గారెడ్డి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆజాదీ కా గౌరవ్ పేరుతో పాదయాత్రలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్ది రోజులుగా పాదయాత్రను నిర్వహిస్తున్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆజాదీ కా గౌరవ్ పేరుతో పాదయాత్రలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్ది రోజులుగా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎవరు పిలిచినా పిలవకున్నా మునుగోడులో ప్రచారానికి వెళ్తానని చెప్పారు. తనవంతుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. తన దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటకు తీస్తానని వెల్లడించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు హోమ్ గార్డులుకాదు, ఐపీఎస్లు కాదు అని అన్నారు. తాము అంతా సైనికులమని.. అధిష్టానమే తమకు బాస్ అని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోతల రాయుడు అని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో ఈసారి బీజేపీ గెలవదని అన్నారు. ఈటల రాజేందర్ కూడా హుజురాబాద్లో ఓడిపోతానన్న భయంతో.. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నాడని విమర్శించారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తమకు ఇంచార్జ్గా వస్తే తాను హ్యాపీ అని జగ్గారెడ్డి అన్నారు. ఇక, రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వ్యవహారాలపై నో కామెంట్స్ అని జగ్గారెడ్డి చెప్పారు.
ఇక, రాష్ట్రంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలతో, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకునే పరిణామాలపై జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన మౌనం పాటిస్తున్నారు. పార్టీలో కల్లోలం లాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్న జగ్గారెడ్డి మాత్రం మౌనం వీడటం లేదు. ప్రస్తుతం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే నవంబర్ 5న తాను మౌనం వీడుతానని ఇటీవల జగ్గారెడ్డి వెల్లడించారు. అదే రోజున గాంధీ భవన్లో లో మీడియాతో మాట్లాడుతానన్నారు.