ఏడాదిన్నర నుంచి కొంతమంది సోషల్ మీడియా ద్వారా తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వుండొద్దా..? దీని వెనుక వ్యూహం వుందా, ఎవరున్నారు అని ఆయన ప్రశ్నించారు. 

ఏడాదిన్నర నుంచి కొంతమంది సోషల్ మీడియా ద్వారా తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల వాళ్లకు వచ్చే ఆనందం ఏంటో తనకు అర్ధం కావడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఎవరు వున్నారు.. వాళ్లకు దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియడం లేదన్నారు. కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వుండొద్దా..? దీని వెనుక వ్యూహం వుందా, ఎవరున్నారు అని ఆయన ప్రశ్నించారు.

తాను కన్నెర్ర చేస్తే మీరు వుంటారా అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. తాను పార్టీ మారుతున్నానని చెప్పడానికి మీకు ప్యాకేజీలు ఎవరిస్తున్నారు అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లోకి ఈ కల్చర్ తెచ్చిందే టీడీపీ అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని జగ్గారెడ్డి తెలిపారు. కార్యక్రమాలు చూసి రాహుల్ కూడా ఇంప్రెస్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. 

తన పేరు రాహుల్ గాంధీకి బాగా నోటెడ్ అయ్యిందని.. ఇది జరిగిన పదిరోజులకే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నానని ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఇంత శాడిజం ఏంటో అర్ధం కావడం లేదని.. 2018లో ప్రభుత్వం తనను జైలుకు పంపిందని జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్‌పై కొట్లాడి గెలిచానని.. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావొద్దనే ఉద్దేశంతో తన భార్యను పోటీకి పెట్టానని ఆయన వెల్లడించారు. 

సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పోటీలో వుండాలని నిలబెట్టానని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన 230 ఓట్లు పార్టీకే రావాలని పోటీ పెట్టామని.. అదనంగా ఓట్లు సాధించామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మరోసారి తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏడాది నుంచి యాదగిరి గుట్టపై ఆటోడ్రైవర్లను అనుమతించడం లేదని.. దీంతో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వీరి ఉపాధి పోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమైందని అందువల్ల వారికి జీవనోపాధిని కాల్పించాలని జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానని ఆయన తెలిపారు.