విక్రం గౌడ్ అరెస్టు ఆసుపత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టకు తరలించిన పోలీసులు  

తనపైన కాల్పులు జరిపించుకుని డ్రామా నడిపిన విక్రం గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆసుపత్రి నుంచి డిచ్చార్జి కాగానే పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇక ఆసుపత్రిలో చికిత్స అవసరం లేదని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఆయనను గురువారం మధ్యామ్నం 12 గంటల తర్వాత డిచ్చార్జి చేసింది.

నిన్న సిటి సిపి మహేందర్ రెడ్డి ప్రకటించిన రీతిలోనే ఆసుపత్రి నుంచి బయటకు రాగానే అరెస్టు చేస్తామన్నారు. అదే రీతిలో ఈరోజు అరెస్టు చేశారు. ఇప్పటికే విక్రం గౌడ్ కాల్పుల డ్రామా కేసులో ఐదురుగు నిందితులను పోలీసులు రిమాండ్ చేశారు. తాజాగా విక్రం ను కూడా కోర్టుకు తరలించిన తర్వాత రిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే వీల్ చైర్ మీదనే విక్రం గౌడ్ ను కోర్టుకు తరలించారు పోలీసులు.

తనపై కాల్పులు జరిపించుకుని తద్వారా తన నియోజకవర్గంలో సానుభూతి సంపాదించాలన్న కక్కుర్తి బుద్ధితో విక్రం ఇంత పనికి ఒడిగట్టాడు. అలాగే తన అప్పుల బాధనుంచి తప్పించుకోవడంతోపాటు వారికి తక్కువ మొత్తాలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కాల్పుల సీన్ క్రియేట్ చేసి తుదకు జైలు పాలయ్యే పరిస్థితితెచ్చుకున్నాడు విక్రం గౌడ్. విక్రం ఆరోగ్య పరిస్థితిపై జడ్జి పరిశీలించిన తర్వాత విక్రం ను రిమాండ్ చేసి జైలకు పంపుతారా లేక పూర్తి ఆరోగ్యం చేకూరేవరకు ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.