త్వరలో ఎన్నికలు... వీహెచ్ సంచలన ప్రకటన
తన రాజకీయ జీవితంపై వీహెచ్ కీలక ప్రకటన చేశారు. తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, చివరి వరకూ పార్టీకి సేవలు అందిస్తానని హనుమంతరావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసేసి.. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత
వి హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు.
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోనని వీహెచ్ ప్రకటించారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని సోమవారం మధ్యాహ్నం వీహెచ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంపై వీహెచ్ కీలక ప్రకటన చేశారు. తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, చివరి వరకూ పార్టీకి సేవలు అందిస్తానని హనుమంతరావు తెలిపారు. కేసీఆర్ను గద్దె దించడమే ధ్యేయంగా.. ప్రజల కోసం పని చేస్తానని అన్నారు.
వీహెచ్ ప్రకటనతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోతున్నారనే చర్చలు జరుగుతున్నాయి. వయసు సహకరించకపోవడం వల్లే వీహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.