కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా వృద్ధులకి, వితంతువులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామన్నారు రాహుల్ గాంధీ. ఇటీవల పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం జరిగిందని.. దీనికి బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా వృద్ధులకి, వితంతువులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామన్నారు రాహుల్ గాంధీ. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కర్ణాటకలోనూ అవినీతి ప్రభుత్వం వుందని.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలబడి వుందని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ ఇదే జరుగుతుందని రాహుల్ జోస్యం చెప్పారు.
ఇక్కడ ఓ వైపు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన మిత్రులు వున్నారని.. మరోవైపు రైతులు, దళితులు, ఆదివాసీలు వున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందని.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్యే పోటీ అన్నారు. ఇటీవల పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం జరిగిందని.. దీనికి బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించామన్నారు. కానీ కేసీఆర్ మనుషులు ఎవరూ రాలేదని.. దీనిని బట్టి బీజేపీకి బీఆర్ఎస్ అని తేలిందని రాహుల్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తెలంగాణకు రాజులా భావిస్తాడని, రాష్ట్రాన్ని జాగీరులా ఫీలవుతాడని రాహుల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరుపేదలకు, గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ భూములు కేసీఆర్వి కావని మీవని రాహుల్ చెప్పారు. ముఖ్యమంత్రి అవినీతి పరాకాష్టకు చేరిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ విషయం భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తన దృష్టికి వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు.
ధరణి ద్వారా ముఖ్యమంత్రి భూములను , మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులు, దళితులు, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల నుంచి కేసీఆర్ దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోందని.. కానీ బీజేపీ బీఆర్ఎస్కి బీ టీమ్గా పనిచేశారని ఆయన ఆరోపించారు. రైతు చట్టాల బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ మద్ధతు పలికిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.
మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ అండగా నిలబడుతున్నారని, ప్రధాని చేతిలో కేసీఆర్ రిమోట్ కంట్రోల్ వుందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించామని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. జోడో యాత్ర ద్వారా తెలంగాణకు తొలిసారి రావడం ఆనందంగా వుందన్నారు . ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలని , మా ఐడియాలజీ దేశాన్ని కలపడం.. ఇతరులను విభజించడమన్నారు.
