గ్రూపులతో కాంగ్రెస్ బలహీనం, చర్యలు తీసుకోవాలి: జానారెడ్డి సంచలనం
గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీని బలహీనపర్చేవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
హైదరాబాద్: గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీని బలహీనపర్చేవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
గురువారం నాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పీసీసీ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.ఈ వ్యవహరంలో పీసీసీ స్పందించకపోతే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు.
విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆయన పార్టీ నేతలకు హితవు పలికారు.పార్టీలోని నేతలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆయన స్పందించారు. ఈ రకమైన పోస్టుల వల్ల తమను అభిమానించే నాయకుడికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకొన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ తరహా వ్యవహారం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.