(వీడియో) హైదరాబాద్ ధర్నా చౌక్ మూసేస్తారా...
ఆ రోజు, తెలంగాణ వస్తే ఇందిరా పార్క్ దగ్గర ఒక్క ధర్నా కూడా జరుగదన్నమాటకు అర్థం ఇదేనా...
కోదండరాం కొరకరాని కొయ్య కావడం, నిరుద్యోగల ర్యాలీ అరెస్టుల పాలయినా ఇలాంటి ర్యాలీలు ముందు ముందు జరుపుతామని జెఎసి ఛెయిర్మన్ ప్రకటించడంతో ప్రభుత్వం ఇపుడు ఇందిరా పార్క్ దగ్గిర ఉన్న ధర్నా చౌక్ ను మూసేయాలనుకంటున్నట్లు సమాచారం.
ముందు ముందు ఉద్యమాలు ముదిరే వీలున్నందున సమీపంలో ఉన్న సెక్రెటేరియట్ కు సెక్యూరిటీ ముప్పు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల ఈ చౌక్ ను మూసేసేందుకు ప్రయ్నతాలు జరుగుతున్నాయి.
ధర్నా చౌక్ లేని తెలంగాణా ఉద్యమం వూహించ లేం. తెలంగాణా ఉద్యమం హైదరాబాద్ లో హోరెత్తింది ఇక్కడే. ఉద్యమ కాలమంతా ఎదో ఒక సంఘం ఇక్కడ తెలంగాణా నినాదం వినిపిస్తూనే వచ్చింది. అంతెందుకు, ఇక్కడ జరిగిన అనేక ఉద్యమాలలో కెసిఆర్ స్వయంగా పాల్గొన్నారు, మాట్లాడారు. పోరాటానికి ప్రజలను ఉసికొల్పారు. ఈ వీడియో సాక్ష్యం.
ధర్నా చౌక్ హైదరాబాద్ లో ప్రజాస్వామిక చిహ్నంగా మారిపోయింది. సమస్యలు పరిష్కామమయినా కాకపోయినా ఇక్కడి కొచ్చి ఒక రోజంతా దీక్ష జరపడం, పాడడం,ఆడడం నినాదాలీయడం చాలా మందికి ప్రజాస్వామిక బాధ్యత అయింది.
అయితే, వచ్చే రెండేళ్లలో ఇక ఉద్యమాలు తీవ్రతరమయ్యో అవకాశాలున్నాయి.ఎల్లపుడూ ధర్నా చౌక్ ధర్నాలకు అనుమతి నిరాకరించడం కష్టం. ఈ చౌక్ ని వూరిబయటకెక్కడికో లేదా వూర్లోనే ఏదో మూలకో మార్చేస్తే పోలా... ఇది ఆలోచనట.
ఇదే జరుగబోతున్నదని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు.
‘ప్రజాందోళనలను, నిరసన గళాలను అణచి వారి రోదనలను అరణ్య రోదనలు గా చెయ్యాలనే కుట్ర తో ప్రభుత్వము ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ నుండి మార్చే ప్రయత్నము చేస్తున్నది,‘ అని కాంగ్రెస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జి నిరంజన్ అరోపిస్తున్నారు.
ప్రజాస్వామ్యములో ప్రజావ్యతిరేక విధానాలను నిరసించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని దాని కాలరాయడం అన్యాయమని ఆయన అన్నారు.
‘బ్రిటిష్ ప్రభుత్వము కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కానీ కెసిఆర్ లా నియంతృత్వ పోకడలకు పోయి ఉంటే ప్రజల కలలు సాకారమయ్యెడివే కావు, స్వాతం త్య్రం కానీ తెలంగాణ రాష్ట్రము కానీ సిద్దించేవి కావు,’ అని ఆయన ఘాటుగా స్పందించారు.
ప్రజల ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన నేత ప్రజలను కలువకుండ దూరముగా ఉండాలనుకోవడం, నిరసన గొంతు వినరాదు,ఆందోళనను కనరాదనుకోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ రోజు తెలంగాణ వస్తే ఇందిరా పార్క్ దగ్గర ఒక్క ధర్నా కూడా జరుగదు అన్న ఆయన మాటలలోని ఉద్దేశ్యము ఇదేనేమోనని ఇప్పుడు తెలుస్తున్నదని ఆయన అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రద్దీగా ఉండే ధర్నా చౌకుగా ఉన్న జంతర్ మంతర్ రోడ్డుకు లేని అభ్యంతరాలు ఇక్కడెందుకు అని ప్రశ్నిస్తూ ప్రజలు తమ నిరసనను ప్రజల మధ్య వ్యక్త పరుచాలనుకుంటారు కానీ , నిర్మానుష్యం... అరణ్యాలలలో కానీ కాదని పాలకులు గ్రహిస్తే మంచిదని ఆయన సూచించారు.
ధర్నా చౌక్ మూసేసే ప్రతిపాదన మానుకోవాలని నిరంజన్ కోరారు.