కంటోన్మెంట్ రోడ్డు మూసివేత: సుప్రీంకోర్టులో పిటిషన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్డు మూసివేతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్డు మూసివేతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మిలటరీ అధికారుల ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రాంతం నుండి సఫిల్ గూడ, మల్కాజిగిరి, ఈసీఐఎల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం ఉంది. ఈ రోడ్డును మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కంటోన్మెంట్ రోడ్డును మిలటరీ అధికారులు తరచూ మూసివేస్తుంటారు. కంటోన్మెంట్ పాలక వర్గానికి కూడ సమాచారం ఇవ్వకుండా రోడ్డు మూసివేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ రోడ్డును మూసివేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ సిటిజన్ అనూప్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.ఈ రోడ్డు మూసివేతను నిరసిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే.