బీఆర్ఎస్కు వీ హనుమంతరావు సవాల్.. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా
తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు దండుకునే ప్రభుత్వ పథకాల ఫలాలను అందిస్తున్నాయని కాంగ్రెస్ లీడర్ వీ హనుమంతరావు అన్నారు. దళిత బంధువులో అవినీతి లేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
V Hanumanth rao: బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సీనియర్ లీడర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు సవాల్ విసిరారు. దళిత బంధు పథకంలో కమీషన్ తీసుకోవడం లేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధం అని ప్రకటించారు. వీ హనుమంత రావు మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఒంటికాలిపై లేచారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాల్లో లంచం ఇచ్చిన వారికే లబ్ది చేకూరుతున్నదని ఆరోపించారు.
తెలంగాణలో ఒక వైపు అధికార పార్టీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నదనే అదే ప్రభుత్వం మరో వైపు రైతుల పాట్ల కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని వీహెచ్ ఆరోపించారు. తమది రైతుల పక్షపాత ప్రభుత్వం అని పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. కిసాన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్నారని విమర్శించారు. వాస్తవంలో స్వరాష్ట్రమైన తెలంగాణలోనే రైతుల కన్నీళ్లు పట్టించుకోకుండా ఉన్నారని ఫైర్ అయ్యారు.
ఆకర్షణీయ పథకాలు ముందు పెట్టి అవినీతికి పాల్పడుతున్నదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రూ. 2 లక్షలు తీసుకుని డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వలేదా? రూ. 2 లక్షల కమీషన్ తీసుకుని దళిబంధు ఇవ్వలేదా? అంటూ ప్రశ్నలు సంధించారు.
Also Read: Odisha Train Tragedy: రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్తోనే దుర్మరణం
నూతన సచివాలయం ప్రస్తావననూ ఆయన తెచ్చారు. ఈ సచివాలయం వద్దకు సాధారణ ప్రజలే కాదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకూ ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహించారు. అలాగే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తామే తెలంగాణలో అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. అంతేకాదు, సూర్యాపేటలో భారీ బీసీ గర్జన సభ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టూ వీహెచ్ వెల్లడించారు.