హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో ఓ విద్యార్ధి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. విశాల్ అనే విద్యార్ధి ఛాతీలో నొప్పి రావడంతో కారిడార్లో నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అప్పట్లో గుండెపోటు అనే మాట చాలా అరుదుగా వినిపించేది... ఏ యాబై అరవయేళ్లు మీదపడిన వారే ఎక్కువగా గుండె పోటుకు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలి,అహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఆరోగ్యంగా వుంటూనే సడన్ గా రోడ్లపై వెళుతుండగానో, బహిరంగ ప్రదేశాల్లోనో హార్ట్ స్టోక్ కు గురవుతున్నారు చాలామంది.
కొద్దిరోజుల క్రితం నిర్మల్లో అందరూ సంతోషంలో మునిగివున్న సమయంలో రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు కర్నూలు జిల్లా ఆదోనీలో జిమ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుండెపోటుతో సాయి అనే యువకుడు మరణించాడు.
Also Read: క్రికెట్ లో తీవ్ర విషాదం.. బౌలింగ్ చేస్తూ పడిపోయి.. సెకన్లలో అంతులేని లోకాలకు..
తాజాగా హైదరాబాద్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఛాతీలో నొప్పి రావడంతో ఓ విద్యార్ధి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజీకి చెందిన విశాల్ అనే విద్యార్ధి ఛాతీలో నొప్పి రావడంతో కారిడార్లో నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన తోటి విద్యార్ధులు, కాలేజీ సిబ్బంది విశాల్ను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే విశాల్ మరణించాడు. ఇతని స్వస్థలం రాజస్థాన్గా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో గుండె సమస్యలు పెరిగిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో హార్ట్ స్ట్రోక్ కు గురవుతున్న వారిని కాపాడేందుకు సకాలంలో సిపిఆర్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సిపిఆర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్డియాక్ అరెస్ట్ గురైన వారికి సకాలంలో సీపీఆర్ అందించే ఉద్దేశ్యంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సిపిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రారంభించారు.
