తెలంగాణలో పోలీసులకు కొత్త కొత్త ఎసి కార్లు కొనిచ్చిర్రు సిఎం కెసిఆర్. పోలీసు స్టేషన్లల్ల మెయింటెనెన్స్ కోసం మస్తుగా డబ్బులు ఇచ్చుడు కూడా కెసిఆరే షురూ చేసిర్రు. పోలీసుల జీతాలు పెంచిర్రు. అందరికంటే ఎక్కువగా వాళ్లను పెద్ద కొడుకు లెక్క చూసుకోబట్టిర్రు సిఎం గారు. తీరా ఇంత చేసిన సిఎం గారికి వాళ్లిచ్చిన నజరానా చూస్తే అందరూ షాక్ అవుతారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్లలో రెండున్నర కోట్ల రుపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ ను నిర్మించారు. ఆ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలోనే అత్యంత ఆదునిక సౌకర్యాలు కలిగిన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కాబట్టి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ , జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ సునీతారెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్, రాచకొండ సిపి మహేష్ భగవత్ ఇంకా పెద్ద పెద్ద లీడర్లు, పోలీసు ఆఫీసర్లు మీటింగ్ లో పాల్గొన్నరు.
అయితే అసలు కిటుకు ఇక్కడే ఉంది. రెండున్నర కోట్లు పెట్టి కట్టించిన రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు స్టేసన్ ప్రారంభోత్సవం ఫ్లెక్సీలో సిఎం కెసిఆర్ ఫొటో పెట్టనే పెట్టలేదు. మంత్రులు కెటిఆర్, పట్నం మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహ్మారెడ్డితోపాటు డిజిపి అనురాగ్ శర్మ, మహేష్ భగవత్ ఫొటోలతో సరిపెట్టారు. రాష్ట్రమంతటికీ ఇంతటి ప్రాముఖ్యమైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో లేకపోవడం టిఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం మంత్రుల ఫొటోలతో సరిపెట్టుకోవడమేంటని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.
బంగారు తెలంగాణలో పోలీసులను నెత్తిన పెట్టుకుంటే ఇట్లా చేసిర్రేందబ్బా అని కొందరు గులాబీ నేతలు సైతం ముక్కుమీద వేలేసుకుంటున్నారు. అసలు ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆధునిక పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ లో సిఎం ఫొటో పెట్టకపోవడం మాత్రం తప్పేనని కొందరు వాదిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూద్దాం.
