ఆ నాలుగు మండలాల్లో దళితబంధు: ఈ నెల 27న కేసీఆర్ కీలక సమావేశం
హూజూరాబాద్ తో పాటు కొత్తగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ ఈ నెల 27న అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నాలుగు మండలాలపై సమావేశం నిర్వహిస్తానని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: హుజూరాబాద్ తో పాటు మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 27న సమీక్షించనున్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. గత నెల 16వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.
చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ హుజూరాబాద్ తో పాటు ఈ నాలుగు మండలాల్లో అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నియోజకవర్గాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ ఈ నాలుగు మండలాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్ననారు.
ఈ నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా పరిషత్ ఛైర్మెన్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా హాజరు కానున్నారు.