CM Breakfast Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అక్టోబర్ 6న ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు

CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బాలల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మరో ప్రధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకమైన 'సీఎం అల్పాహార పథకం'ను ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 6న లాంఛనంగా ప్రారంభించనున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం ప్రత్యేక అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా.. అదే సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.  ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 6న అల్పాహార పథకాన్ని సజావుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు . ముఖ్యమంత్రి ఆదేశాల అనుగుణంగా కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకంతో పాటు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిఎం అల్పాహార పథకం ప్రారంభించబడుతుందని సిఎస్ తెలిపారు.  

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను అల్పాహార పథకం ప్రారంభానికి గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అల్పాహార పథకం ప్రారంభించే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనేలా తగు ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ అన్నారు. పట్టణ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అమలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు తీసుకుంటాయి.

ఇదిలా ఉంటే అల్పాహారం పేరుతో ఇప్పటికే తమిళనాడులో ఓ పథకం లో ఉంది. ఈ పథకం తీరు తెన్నులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ తమిళనాడు పంపించారు. అయితే.. తమిళనాడు వెళ్ళిన ఐఏఎస్ బృందం  ఆ పథకం అమలు తీరుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే బ్రేక్ఫాస్ట్ అందిస్తుండగా తెలంగాణ మాత్రం ప్రాథమిక పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైతం అందించాలని నిర్ణయించింది. అల్పాహార పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయనుంది.

ఇదిలాఉంటే.. అక్టోబరు 14లోగా బతుకమ్మ చీరల పంపిణీ, అక్టోబర్ 18లోగా స్పోర్ట్స్ కిట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.