రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకులకు సీఎం కేసీఆర్ దూరం... ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేసిన గవర్నర్ తమిళిసై..
తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్భవన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. రాజ్భవన్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్భవన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. రాజ్భవన్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన గవర్నర్ తమిళిసై పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. కొత్త భవనాలు నిర్మించటం మాత్రమే అభివృద్ది కాదు.. నేషనల్ బిల్డింగ్ అనేది అభివృద్ది అన్నారు. కొందరికి ఫామ్హౌస్లు కాదు.. అందరికి ఫామ్లు కావాలని అన్నారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని చెప్పారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని అన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ స్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
‘‘తెలంగాణ గౌరవాన్ని నిలబెడుదాం. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ హక్కులను నిబెట్టుకుందాం. తెలంగాణతో నాకున్న అనుబంధం మూడేళ్ల నుంచి కాదు.. ఇది పుట్టుకతో జీవి నుంచే వచ్చింది. తెలంగాణ అభ్యున్నతితో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం హార్డ్ వర్క్, నిజాయితీ, ప్రేమ. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తాను’’ అని గవర్నర్ తమిళిసై తెలుగులో ప్రసంగించారు.
Also Read: గణతంత్ర వేడుకలు: కెసిఆర్ కు హైకోర్టు షాక్, తమిళిసైకి ఊరట
అదే సమయంలో.. రాష్ట్రాభివృద్దికి అవసరమైన సహకారాన్ని రాజ్భవన్ అందిస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రాజ్భవన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. మరోవైపు తెలంగాణ అభివృద్దికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై థాంక్స్ చెప్పారు.
ఈ విధమైన కామెంట్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారనే మాట వినిపిస్తోంది. గత కొంతకాలంగా రాజ్భవన్ వర్సెస్ ప్రగతిభవన్గా ఉన్న వివాదాలు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, గతేడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్భవన్లోనే నిర్వహించగా.. ఆ సమయంలో కూడా కేసీఆర్ హాజరుకాలేదు.