జిల్లాల కుదింపుపై సీఎం ఏమన్నారంటే...
జిల్లాలను కుదిస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రకటించిన కేసీఆర్
తెలంగాణలో కొత్త ఏర్పాటు చేసిన జిల్లాలు త్వరలో తగ్గిస్తారని వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ రోజు అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. జిల్లాల విభజనను కేంద్రం అంగీకరించలేదంటూ కొన్ని తెలుగు మీడియాల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో మీడియా అత్యుత్సాహంతో లేనిపోని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
జిల్లాలను కుదిస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ఏర్పాటు, విలీనం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విషయంలో ఏలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
జిల్లాల విభజనకు సంబంధించి కేంద్రం, హోంమంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జిల్లాల విభజనను కేంద్రం అంగీకరించలేదని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు.