జాతీయ రైతు సంఘాల నేతలతో రెండో రోజు సమావేశమైన సీఎం కేసీఆర్
జాతీయ రైతు సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం రెండో రోజు కొనసాగుతుంది. ఈ సమావేశానికి 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. వ్యవసాయరంగం, రైతులు ఏదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం, సాగునీటి రంగాల అభివృద్ధిపై చర్చిస్తున్నట్లు సమాచారం.
జాతీయ రైతు సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. వ్యవసాయరంగం, రైతులు ఏదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం, సాగునీటి రంగాల అభివృద్ధిపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొల్పిన అంశాలపై జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఇక, సీఎం కేసీఆర్ శనివారం కూడా రైతు సంఘం నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం ఉదయం నుంచి రాత్రి దాకా సుధీర్ఘంగా కొనసాగింది.
శనివారం రోజున జరిగిన సమావేశంలో.. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వ్యవసాయ పరిస్థితులు, పద్దతులు, ఆయా ప్రభుత్వాల నుంచి అందుతున్న మద్దతు, సాగులో నూతనంగా అందివస్తున్న సాంకేతికత తదితరాలపై కేసీఆర్ చర్చించారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతును కూడా కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతన్నలకు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు పథకం గురించి కేసీఆర్ వివరించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది.
ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు. పంటలు పండించడంతోపాటు, గిట్టుబాటు ధరలను కల్పించాలని డిమాండ్ చేశారు. అసంఘటితంగా ఉన్న రైతాంగం సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని రైతు సంఘాల నాయకులు ఆకాంక్షించారు. దేశంలో సరికొత్త రైతు ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరమున్నదని వారు స్పష్టంచేశారు.