ప్రాజెక్టులు కళ్లకు కనిపించడం లేదా: భట్టిపై కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కేసీఆర్ల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ఆరు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణదేనన్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కేసీఆర్ల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ఆరు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణదేనన్నారు.
ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉందని.. ఈ బడ్జెట్లోనూ అప్పులు తీసుకొస్తామని చెబుతోందని భట్టి ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీళ్లకు ఏ ఒక్క ప్రాజెక్ట్ కనిపించడం లేదా అంటూ వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ వీళ్లకు కనిపించడం లేదా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. మీ జిల్లాలోని భక్తరామదాసు ప్రాజెక్ట్ కనిపించడం లేదా.. లక్ష్మీ బ్యారేజ్ను 28 లక్షల మంది సందర్శించారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఐదేళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్లు ఇదే పాటపాడుతున్నారని.. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాతైనా వీళ్ల బుద్ధి మారాలని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికలకెళ్తే.. ఈవీఎంల వల్ల గెలిచామని ఆరోపించారని, సంస్కారం లేకుండా మాట్లాడితే మంచిది కాదని ముఖ్యమంత్రి హితవు పలికారు.
రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఎక్కడుందని.. ఏదిపడితే అది మాట్లాడితే మీకే గౌరవం కాదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సభను తప్పుదోవ పట్టించడం సరికాదని.. రాష్ట్రం వచ్చిన ఏడాది వరకు ఆదాయంపై అవగాహన లేదని.. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు.
వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ను ప్రవేశపెట్టామని.. విమర్శలు చేస్తే చేసినప్పటికీ పరిధిలో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బడ్జెట్లో కోత పెట్టామని మీరేందుకు చెప్పడం.. మేమే చెప్తున్నామన్నారు.
ఆర్ధికమాంద్యం కారణంగానే కోత విధించామని కేసీఆర్ స్పష్టం చేశారు. కోత మేము పెట్టింది కాదని.. కేంద్రం పెట్టిందని సీఎం గుర్తు చేశారు.