తెలంగాణపై... కేంద్ర ప్రభుత్వమే కాదు ప్రపంచ నిపుణుల ప్రశంసలు: సీఎం కేసీఆర్
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో అడుగంటి పోయిన జలాలను తిరిగి సమకూర్చే దిశగా సాగునీటి, తాగునీటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో భూ ఉపరితల జలాల లభ్యతను పెంచడం తద్వారా అడుగంటిన భూగర్భ జలాలను భూమి పై పొరల్లోకి చేరే విధంగా, జల పునరుజ్జీవన జరుగుతున్నదన్నారు.
తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, శుద్ధిచేసిన, సురక్షిత తాగునీటిని గడప గడపకూ అందించడం ద్వారా తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలడమే కాకుండా, ఫ్లోరైడ్ వంటి ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపిందన్నారు. గడచిన ఆరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యల ద్వారా తెలంగాణ జల వనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా ప్రపంచ జల వనరుల నిపుణులు తెలంగాణలో జరుగుతున్న జల పునరుజ్జీవన కార్యక్రమాలను కొనియాడుతుండటం మనకు గర్వకారణమన్నారు కేసీఆర్.
read more అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ పెన్షన్లు.. ఎర్రబెల్లి దయాకర్ రావు
ఇదిలావుంటే ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ‘క్యాచ్ ద రెయిన్’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ నుండి వీడియో కాన్పరెన్సు ద్వారా లాంచనంగా ప్రారంభించారు. వర్షపునీటిని పూర్తిస్థాయిలో వినియోగించు కోవడంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్నిగ్రామ పట్టణ ప్రాంతాల్లో ఈకార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
క్యాచ్ ద రెయిన్ పేరిట నిర్వహించే ఈప్రత్యేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నేటి నుండి అనగా ఈనెల 22 నుండి నవంబరు 30వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుంది. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే గ్రామాలవారీగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తారు.