సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారు- వైఎస్ఆర్ టీపీ నాయకుడు ఏపూరి సోమన్న
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దళితులను మోసం చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఏపూరి సోమన్న ఆరోపించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా సీఎంపై ఏపూరి విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని గాయకుడు, వైఎస్ఆర్ టీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ ఏపూరి సోమన్న ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వైఎస్ఆర్ టీపీ స్టేట్ ఆఫీసులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్థంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్పై ఏపూరి సోమన్న విమర్శలు చేశారు. 125 అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, మాట మీద నిలబడలేదని విమర్శించారు. మూడెకరాల భూమి ఇవ్వలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూంలు ఎందరికి ఇచ్చారన్ని, దళిత బంధు పథకం ఎటు పోయిందని ప్రశ్నించారు. దళితల నుంచి ఒక్కరికి కూడా కేబినేట్ లో స్థానం కల్పించలేదని విమర్శించారు. దళితులపై సీఎం కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దళితులే కేసీఆర్కు బుద్ది చెబుతారని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
తమ పార్టీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ దళితుల హక్కుల సాధన కోసం ప్రయత్నం చేస్తుందని అన్నారు. అందుకే మన రాజ్యాంగ నిర్మాత సూచించిన నీలి రంగును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో స్థానం కల్పించామని చెప్పారు. దళితుల సాధికారతకు శర్మిల పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ అన్ని వర్గాల జనాభాకు సరైన ప్రాతినిధ్యం ఇస్తుందని చెప్పారు. వైఎస్ వర్మిల ఈ విషయంలో కట్టుబడి ఉన్నారని అన్నారు.
రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత అంబేద్కర్ దే..
సమాజంలో వివక్ష, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కే దక్కుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేశారని అన్నారు. ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల కోసం పరితపించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని పిట్ల రాంరెడ్డి స్పష్టం చేశారు. దళిత సమాజానికి ఎన్నో మాటలు చెప్పి సీఎం కేసీఆర్ ఇప్పుడు వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దళిత సమాజం పట్ల కేసీఆర్ చిన్న చూపుతో ఉన్నారని అన్నారు. ఆయనకు త్వరలోనే అందరూ బుద్ధి చెబుతారని అన్నారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పథకం తీసుకొచ్చారని ఆరోపించారు. ఇప్పుడు దానిని ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. ఆ ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పినా.. ఆయనలో ఇంకా మార్పు రావడం లేదని అన్నారు.