ప్రారంభమైన భట్టి విక్రమార్క ‘‘పీపుల్స్ మార్చ్’’.. 91 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర
తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రను ప్రారంభించారు. పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన భట్టి పాదయాత్ర .. 91 రోజుల పాటు 1365 కిలోమీటర్లు, 39 నియోజకవర్గాల్లో సాగనుంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్ థాక్రే యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్నారు భట్టి. ప్రజా సమస్యలపైనే ఎక్కువ ఫోకస్ పెడతామని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రను ప్రారంభించే ముందు పిప్రి గ్రామంలో విక్రమార్కకు ఘనస్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు. మహిళలు మంగళ హారతులు పట్టి, ఆయనకు తిలకం దిద్దారు.
పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన భట్టి పాదయాత్ర .. 91 రోజుల పాటు 1365 కిలోమీటర్లు, 39 నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాంలో ఎవరున్నా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం నిందితులను చట్టప్రకారం అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని భట్టి ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు. బాధ్యతలను విస్మరించారని, బాధ్యతలను డబ్బులకు అమ్మేసుకున్నారని భట్టి ఆరోపించారు. రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేదని.. రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని విక్రమార్క ఆకాంక్షించారు.
Also Read: నేటి నుండి భట్టి పాదయాత్ర: మహేశ్వర్ రెడ్డితో విక్రమార్క భేటీ
కాగా.. మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించిన నాలుగు రోజులకే ముగించారు. తన పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేయాలని ఆదేశించడంపై మాణిక్ రావు థాక్రేపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఠాక్రేకు లేఖ రాశారు . తొలుత మల్లుభట్టి విక్రమార్క , మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కానీ మహేశ్వర్ రెడ్డి ఒక్కరే పాదయాత్రను ప్రారంభించారు. అయితే యాత్ర ప్రారంభించిన నాలుగు రోజులకే మహేశ్వర్ రెడ్డి యాత్రను ముగించాల్సి వచ్చింది.