1200కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి... చిరంజీవికి అభిమాని స్పెషల్ భర్త్ డే గిప్ట్
మెగా కుటుంబంపై అభిమానంతో చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 1200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నాడు.
కొండగట్టు: అతడు మెగాస్టార్ చిరంజీవి హార్డ్ ఫ్యాన్. అయితే అందరు అభిమానుల మాదిరిగా తన అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా కేవలం కటౌట్లు కట్టి హడావుడి చెయ్యలేదు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలంటూ ఏకంగా 1200కిలోమీటర్లు సైకిల్ యాత్ర నిర్వహించాడు. ఇలా మెగాస్టార్ పై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు.
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ కు మెగా కుటుంబమంటే ఎనలేని అభిమానం. అయితే ఇటీవల ఈ ఫ్యామిలీ పెద్ద చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈశ్వర్ వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామిని కోరుకున్నాడు. వారు కరోనా నుండి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడంతో ఆ దేవుళ్లకు మొక్కు తీర్చకోడానికి సిద్దమయ్యాడు.
వీడియో
ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం ఈశ్వర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సైకిల్ పై బయలుదేరాడు. సుమారు 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి ఇవాళ సరిగ్గా చిరంజీవి పుట్టినరోజున కొండగట్టు కు చేరుకున్నాడు. స్వామివారిని దర్శించుకుని చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు వారి కుటుంబసభ్యులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ... చిరు ఫ్యామిలీ అంటే తనకు ఎంతో ఇష్టమనన్నారు. చిరు, పవన్ కరోనా బారినపడటంతో ఆందోళనకు గురయ్యానని... వారు ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించానని అన్నారు. మొగా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నానంటూ కొండగట్టు నుండి తన స్వస్థలానికి తిరుగుపయనమయ్యాడు ఈశ్వర్.