Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో విషాదం.... పక్కుపచ్చలారని చిన్నారిని చిధిమేసిన ర్యాష్ డ్రైవింగ్

ముక్కుపచ్చలారని చిన్నారిని ఓ యువకుడి నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్ చిధిమేసిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేట పరిధిలో చోటుచేసుకుంది. 

Child Dies In Car Accident at Hyderabad
Author
Hyderabad, First Published Jun 26, 2022, 8:43 AM IST

హైదరాబాద్ : ఓ యువకుడి  నిర్లక్ష్యపు డ్రైవింగ్ ముక్కుపచ్చలారని ఓ చిన్నారి బాలున్ని బలితీసుకుంది. బుడిబుడి  అడుగులేస్తూ గుడి బయట ఆడుకుంటున్న 18నెలల చిన్నారి ఆలయ పూజారి తనయుడి కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చోటుచేసకుంది. 

ఈ ప్రమాదనికి సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట కు చెందిన నరేష్, జ్యోతి దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. నిజాం పేట పరిధిలోని కమ్మరి బస్తీలో 18 నెలల కొడుకు హర్షవర్ధన్ తో కలిసి దంపతులు నివాసముంటున్నారు.  

ఈ కుటుంబం అద్దెకుండే ఇంటికి సమీపంలో షిరిడి సాయిబాబా ఆలయం వుంది. ఈ ఆలయంలో సత్యనారాయణమూర్తి పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన తనయుడు వీర అశ్విత్ (20) కాలనీలో కారు డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. 

ఆలయ సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి హర్షవర్ధన్ ను అశ్విత్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఢీకొట్టాడు. కారు ముందు టైర్ చిన్నారి తలపై నుండి దూసుకెళ్లింది. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన చిన్నారిని తల్లిదండ్రుల దగ్గర్లోని కెపిహెచ్బి రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమింయడంతో డాక్టర్లు కూడా చిన్నారిని కాపాడలేకపోయారు. 

మృతిచెందిన బాలుడు హర్షవర్ధన్ తండ్రి నరేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అశ్విత్ ను అదుపులోకి తీసుకున్న విచారణ చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును బలితీసుకున్న పూజారి తనయున్ని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరిచేత కన్నీరు పెట్టిస్తోంది. 

ఇక పెళ్లయన కొన్ని గంటలు గంటలు గడవకముందే వరుడు మృతిచెందిన విషాదం నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వెలుగోడు మండలంలోని మోత్కూర్ వద్ద  గుర్తుతెలియని వాహనం ఢీకొని కొత్తపెళ్లికొడుకు శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 

 వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే శివ కుమార్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాళ్లకు పారాణి ఆరకముందే భర్తను కోల్పోయిన పెళ్ళికూతురు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది గంటలకే ఇలా జీవిత భాగస్వామిని కోల్పోవడంతో ఆ అమ్మాయి కలలు ఆవిరయ్యారు. కొన్ని గంటల ముందు తన పక్కన పెళ్లిపీటలపై కూర్చున్నవాడు ఇప్పుడు విగతజీవిగా మారి పాడెనెక్కడం ఆ పెళ్ళికూతురు భరించలేకపోతోంది.  

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఘటనాస్థలం నుండి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ఘటనా స్థలానికి దగ్గర్లోని సిసి కెమెరాల రికార్డ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios