విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరింపులు వస్తున్నాయి.. చికోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహరం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. Foreign Exchange Management Act ఉల్లంఘనలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను ప్రశ్నించింది. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన చికోటి ప్రవీణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహరం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. Foreign Exchange Management Act ఉల్లంఘనలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను ప్రశ్నించింది. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన చికోటి ప్రవీణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. పోలీసులకు ఆ విషయం చెప్పడం జరిగిందన్నారు. ఈడీ విచారణలో ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. హిట్మెన్ అనే విదేశీ యాప్లో సుపారీ ఇచ్చామని బెదిరిస్తున్నారని చెప్పారు.
తన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. భద్రతా కోసం హైకోర్టులో పిటిషన్ వేశానని గుర్తుచేశారు. రాజకీయ స్వార్థం కోసమే తన భుజంపై తుపాకీ పెట్టారని అన్నారు. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. గోవా, నేపాల్లలో క్యాసినో లీగల్ అని.. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ విచారణ జరుపుతుందని చెప్పారు. తాను ఎలాంటి హవాలాకు పాల్పడలేదని తెలిపారు.
నిబంధనల ప్రకారమే సినీ ప్రముఖులకు ప్రమోషన్ చెల్లింపులు చేసినట్టుగా చెప్పారు. వీఐపీలు, వీవీఐపీలు క్యాసినోకు వచ్చింది వాస్తవమేనని అంగీకరించారు. అలా రావడం వారి వ్యక్తిగత అని చెప్పారు. తనకు అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయని.. అయితే రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈడీ మళ్లీ విచారణకు ఎప్పుడు రమ్మని పిలిచిన వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.