కేసీఆర్!నన్ను ఎంత తిడితే నీకు అన్ని ఓట్లు పోతాయ్: చంద్రబాబు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఎన్నికల సమరం రంజుగా మారుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఎన్నికల సమరం రంజుగా మారుతోంది.
సోమవారం సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గం కైతలాపూర్లో ప్రజాకూటమి బహిరంగ సభలో కేసీఆర్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్ తనను ఎంత తిడితే అన్ని ఓట్లు పోతాయని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లో ఉన్న వారికి ఇక ఏ భయాలూ అక్కర్లేదని కేసీఆర్ ఏదో చేస్తాడని, మోదీ ఐటీ దాడులు చేస్తాడని భయపడొద్దు అన్నారు. మనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. కేసీఆర్ది దివాలాకోరు తనమని టీఆర్ఎస్ నేతల తిట్ల పురాణానికి భయపడేది లేదన్నారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నాలుగున్నరేళ్లలో హైదరాబాద్కు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీజేపీకి, టీఆర్ఎస్కు తేడా లేదని రెండు ఒక్కటేనన్నారు. కేసీఆర్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కంటే వెయ్యి రెట్ల మంచి పాలన ప్రజాఫ్రంట్ అందిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.