టీటీడీపి నేతలతో బాబు భేటీ: పొత్తులు, వ్యూహంపై చర్చ
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
శనివారం ఉదయం ఆయన లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, 35 శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉందని తెలంగాణ నేతలకు ఆయన చెప్పారు.
కమ్యూనిస్టు పార్టీల వైఖరిపై, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి తీరుపై చంద్రబాబు ఆరా తీశారు. హరికృష్ణ దశదిన కర్మ సందర్భంగా హైదరాబాదు వచ్చిన ఆయన తెలంగాణలో పార్టీ వ్యూహంపై కూడా దృష్టి పెట్టారు.
కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే విషయంపై కూడా చంద్రబాబు సమావేశంలో మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కలిసే అవకాశం ఉంది.
తెలంగాణలో పరిస్థితిని చంద్రబాబుకు వివరించినట్లు సమావేశానంతరం రావుల చంద్రశేఖర రెడ్డి మీడియాతో చెప్పారు. టీడీపిపై కేసిఆర్ చేస్తున్న విమర్శలను కూడా చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. పొత్తులపై తుది నిర్ణయం చంద్రబాబుదేనని ఆయన అన్నారు. పొత్తుల విషయంలో ఏ పార్టీ వైఖరి ఎలా ఉందనే విషయాలను కూడా చంద్రబాబుకు చెప్పినట్లు ఆయన తెలిపారు.