ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కూతురు శిరిష్మ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులో తాను నివాసం ఉంటున్న ఫ్లాట్ లో ఉరేసుకుని ఆమె బలవణ్మరణం చెందారు.
హైదరాబాద్: ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కూతురు శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇంటిరీయర్ డిజైనర్ గా పనిచేస్తున్న ఓయూ కాలనీలోన ట్రయల్ విల్లాస్ లో నివాసం ఉంటున్న గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ తో 2016 డిసెంబర్ లో పెళ్లయింది.
కాగా, ప్రస్తుతం శిరిష్మ, సిద్ధార్థ్ గచ్చిబౌలీలో గల ఐకియా స్టోర్ సమీపంలోని ఫ్లాట్ 906 -డిలో నివాసం ఉంటున్నారు. వివాహమై నాలుగేళ్లు దాటినా వారికి సంతానం కలుగలేదు. దీంతో శిరిష్మ తీవ్ర డిప్రెషన్ కు గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించారు.
రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సిద్దార్థ్ ఉరేసుకున్న శిరిష్మను చూసి కిందికి దింపి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. తండ్రి చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
