సోమేష్ కుమార్కు కేంద్రం షాక్.. తెలంగాణ నుంచి రిలీవ్, ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశం
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది . ఎల్లుండి లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు కేంద్రం షాకిచ్చింది. సోమేశ్ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సోమేశ్ కుమార్ ఏపీ కేడర్కు వెళ్లిపోవాలని ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా డీఓపీటీ రెండు రాష్ట్రాలకు కేటాయించింది. సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్ ను డీఓపీటీ అలాట్ చేసింది. అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు.తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించి సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ ను కేటాయించింది. పరిపాలన పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించాలని కేంద్రం వాదిస్తుంది.
ALso REad : హైకోర్టు ఆదేశాలు:తెలంగాణ సీఎం కేసీఆర్తో సోమేష్ కుమార్ భేటీ
ఇదే వాదనతో కేంద్ర ప్రభుత్వం క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. 2017లో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ కు కేటాయించడాన్ని రద్దు చేసింది. క్యాట్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఏపీ కేడర్ ను సోమేష్ కుమార్ కు కేటాయించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమేష్ కుమార్ స్థానంలో మరొకరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా లేకపోలేదు.