వరంగల్ జిల్లాలో చిట్‌ఫండ్ ఏజెంట్ దంపతుల దాడిలో గాయపడ్డ రాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హన్మకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు కొద్దిసేపటి  క్రితం మృతిచెందాడు. ఈ నెల 3న చిట్‌ఫండ్ డబ్బులపై నిలదీసినందుకు ఏజెంట్ దంపతులు రాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

వరంగల్ జిల్లాలో చిట్‌ఫండ్ ఏజెంట్ దంపతుల దాడిలో గాయపడ్డ రాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హన్మకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. ఈ నెల 3న చిట్‌ఫండ్ డబ్బులపై నిలదీసినందుకు ఏజెంట్ దంపతులు రాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాదాపు 60 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు.. నాటి నుంచి మృత్యువుతో పోరాడుతూ బుధవారం మరణించాడు. 

బాలసముద్రం ప్రాంతానికి చెందిన పిట్టల రాజు కుమార్‌పల్లిలో సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హంటర్‌రోడ్డుకు చెందిన ఏజెంట్ గణేశ్ ద్వారా ఓ చిట్‌ఫండ్ సంస్థలో చిట్టీ వేశాడు. డబ్బులు అవసరం కావడంతో నాలుగు నెలల క్రితం చిట్టీ పాడాడు. చిట్టీ పాడుకుని నెలలు గడుస్తున్నా సొమ్ము ఇవ్వకపోవడంతో ఏజెంట్ గణేశ్ ఇంటికి వెళ్లిన రాజు డబ్బుల కోసం వారిని నిలదీశాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది.

గణేశ్ తన భార్య కావ్యతో కలిసి రాజు సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి రాజుతో వాగ్వివాదానికి దిగారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గణేశ్ భార్య కావ్య వెంట తెచ్చుకున్న పెట్రోలు తీసి దుకాణంలో చల్లి నిప్పు పెట్టింది. అనుకోని ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన రాజు, ఆయన భార్య బయటకు పరుగులు తీశారు. అయితే, దుకాణంలోని సెల్‌ఫోన్లు కాలి బూడిదవుతుండడంతో మళ్లీ లోపలికి వెళ్లి వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి వారిపై పెట్రోలు పోసి గణేశ్, కావ్య అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పి రాజును ఆసుపత్రికి తరలించారు.