Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేట మెడికల్ కాలేజ్‌‌లో ర్యాగింగ్‌.. ఆరుగురిపై కేసు నమోదు..

సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ వైద్యకళాశాలలో (Government Medical College) జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజ్ హాస్టల్‌లో ఫస్ట్ ఇయర్ చదువతున్న విద్యార్థి‌ని దాదాపు 25 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. ఒకవేళ ర్యాగింగ్ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Case registered against 6 students in Suryapet medical college ragging case
Author
Suryapet, First Published Jan 3, 2022, 3:33 PM IST

సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ వైద్యకళాశాలలో (Government Medical College) జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజ్ హాస్టల్‌లో ఫస్ట్ ఇయర్ చదువతున్న విద్యార్థి‌ని దాదాపు 25 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతో పాటు దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి ఆరోపించారు.  కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని, విచారణకు ఆదేశించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. ర్యాగింగ్ జరిగినట్టుగా తెలితే.. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతామని అన్నారు. 

ఈ ఘటనపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ (Harish Rao) స్పందించారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో ragging విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ రోజు ఉదయమే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ రోజు మధ్యాహ్నం లోపు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా చెప్పారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

Also Read: సూర్యాపేట మెడికల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం..

ఈ క్రమంలోనే అధికారులు వేగంగా స్పందించారు.  ఈ క్రమంలోనే హాస్టల్‌లో విచారణ చేపట్టిన డీఎస్పీ మోహన్ కుమార్ (Mohan Kumar).. బాధిత విద్యార్థిని ర్యాగింగ్ చేసినట్టుగా  ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ మోహన్ కుమార్ వెల్లడిచారు. 

అసలేం జరిగిందంటే..
ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాధిత విద్యార్థిని.. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి రూమ్‌లోకి పిలిచారు. తరువాత కాసేపు పేరు, వివరాలు కనుక్కున్నారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్‌ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. అతడి  దుస్తులు విప్పించి  సెల్ ఫోన్ లో వీడియో తీశారు.  అప్పటికే మద్యం తాగి ఉన్నవారు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగకుండా గుండు గీసేందుకు యత్నించగా భయాందోళనకు గురైన విద్యార్థి తప్పించుకుని తన గదికి వెళ్లాడు. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు.  

దీంతో వారు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు అసలు విషయం చెప్పారు. దీంతో స్థానిక పోలీసులు హాస్టల్‌కు చేరుకుని బాధిత విద్యార్థిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే  ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు, అతని తండ్రి ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios