Asianet News TeluguAsianet News Telugu

మూగబోయిన మైక్‌లు, నిలిచిన ప్రచార రథాలు:మునుగోడులో ముగిసిన ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక    ప్రచారానికి ఇవాళ్టితో  తెరపడింది.  ప్రధాన  పార్టీల  తరపున  ఆయా  పార్టీల  అగ్రనేతలు నియోజకవర్గంలో విస్తృతంగా  పర్యటించారు.

Campaign for Munugode bypoll 2022  ends
Author
First Published Nov 1, 2022, 6:19 PM IST

హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని  మంగళవారం నాడు సాయంత్రంతో ప్రచారానికి తెర పడింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రధానపార్టీల తరపున అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. 

ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రధానపార్టీలు తమ  ప్రచారాన్ని  హోరేత్తించాయి. మైకుల మోతలు, ప్రచార రథాల  యాత్రలు,  అగ్రనేతల  రోడ్ షోలు ,ఇంటింటి ప్రచారంతో  మునుగోడు అసెంబ్లీ  నియోజకవర్గంలో  ప్రధాన  పార్టీలు  ప్రచారాన్ని  నిర్వహించాయి.  

ఈ నెల 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్  జరగనుంది. ఈ ఉప  ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి,. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. 

ఈ ఏడాది ఆగస్టు  8వ  తేదీన మునుగోడు ఎమ్మెల్యే  పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి  ఉప  ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే పదవికి  రాజీనామా  చేయడానికి నాలుగు   రోజుల  ముందే రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ కు  రాజీనామా  చేశారు.  అదే  నెల 21 వ తేదీన బీజేపీలో  చేరారు.  గత ఎననికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా  విజయం సాధించారు.  ఈ దఫా మాత్రం బీజేపీ అభ్యర్ధిగా తన  అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ  తరపున బరిలో నిలిచిన పాల్వాయి  స్రవంతి తరపున  టీపీసీసీ  చీఫ్ రేవంత్  రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే  సీతక్క ,మాజీ మంత్రి  రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు ప్రచారం  నిర్వహించారు.

బీజేపీ  అభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున  కేంద్ర మంత్రులతో పాటు ఆ పార్టీ  అగ్రనేతులు ప్రచారం  నిర్వహించారు.  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి, భూపేంద్ర యాదవ్  తదితరులు ప్రచారం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్ ,మాజీ  ఎంపీ  వివేక్  వెంకట స్వామి, దుబ్బాక  ఎమ్మెల్యే  రఘునందన్  రావు మాజీ మంత్రి డికె అరుణ ,ఈటల రాజేందర్  తదితరులు  ఈ  నియోజకవర్గంలో  విస్తృతంగా ప్రచారం  నిర్వహించారు.

also  read:మునుగోడులో ఆశ్చరకరమైన మెజారిటీతో గెలుస్తాం:కేటీఆర్

టీఆర్ఎస్  అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున సీఎం  కేసీఆర్ , కేటీఆర్,  హరీష్  రావు సహా  ఆ పార్టీ  నేతలు విస్తృతంగా  ప్రచారం  నిర్వహించారు. నియోజకవర్గాన్ని  87 యూనిట్లుగా  విభజించి  టీఆర్ఎస్  ప్రచారం నిర్వహించింది.   ప్రచారం ముగింపునకు  రెండు రోజుల ముందు  చండూరులో  నిర్వహించిన ఎన్నికల  సభలో కేసీఆర్ పాల్గొన్నారు.మొయినాబాద్  లో ఎమ్మెల్యేలకు ప్రలోభాల  అంశంపై కేసీఆర్ ఈ సభలో  కొన్ని  అంశాలను వెల్లడించారు. 

ఈ  నియోజకవర్గంలో  ప్రచారం  కోసం  వచ్చిన  ఇతర  ప్రాంతాలకు  చెందిన  పలు పార్టీల  నేతలు  నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని  అధికారులు ఆదేశించారు. దీంతో పలు  పార్టీలకు  చెందిన  స్థానికేతర నేతలు  నియోజకవర్గాన్ని వదిలి  వెళ్తున్నారు. 

ప్రచారం  చివరి రోజున పలివెల  గ్రామంలో టీఆర్ఎస్,  బీజేపీ శ్రేణుల  మధ్య  ఘర్షణ చోటు  చేసుకుంది. ఈటల కాన్వాయ్  పై  టీఆర్ఎస్  దాడి  చేసిందని బీజేపీ  ఆరోపించింది. తమ  పార్టీపై బీజేపీ  దాడి  చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios