టీఎంయూ నేతలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు:కుదరని ఏకాభిప్రాయం
మంత్రివర్గ ఉప సంఘంతో కుదరని ఏకాభిప్రాయం
హైదరాబాద్: ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో టీఎంయూ నేతలతో ఆదివారం నాడు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు చర్చించారు. టీఎంయూ నేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎం కెసిఆర్ కు వివరించేందుకు గాను మంత్రులు ప్రగతిభవన్ కు వెళ్ళారు.
జూన్ 11వ తేది నుండి సమ్మె చేస్తామని ఆర్టీసీ యూనియన్లు యాజమాన్యానానికి నోటీసులు ఇచ్చారు. మంత్రివర్గ ఉప సంఘంతో టీఎంయూ నేతలు ఆదివారం నాడు మంత్రుల క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని టీఎంయూ నేతలు మంత్రివర్గం ఉప సంఘంతో చర్చించారు.
ఐఆర్ విషయమై మంత్రివర్గ ఉప సంఘంతో టీఎంయూ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. కనీసం 15 శాతం ఐఆర్ ఇచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు అంగీకరించినట్టు సమాచారం. కానీ టీఎంయూ నేతలు మాత్రం ఈ విషయమై అంగీకరించలేదని సమాచారం. ఒకవేళ కార్మికులు సమ్మెకు దిగితే ఏం చేయాలనే దానిపై కూడ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొంటుంది. ఐఆర్ పెంచితే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉందని మంత్రివర్గం ఉప సంఘం సభ్యులు టీఎంయూ నేతల దృష్టికి తెచ్చారు.
టీఎంయూ నేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎం కు వివరించేందుకు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ప్రగతి భవన్ కు చేరుకొన్నారు. సీఎం కు టీఎంయూ నేతలతో జరిగిన చర్చల వివరాలను వివరించనున్నారు.