దారుణం : మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త, అరెస్ట్
డోర్నకల్ పట్టణంలో మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు . నిందితుడు మహబూబాబాద్ జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు . నిందితుడిపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు.

డోర్నకల్ పట్టణంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని డోర్నకల్ పట్టణానికి చెందిన టి. రమేశ్గా గుర్తించారు. ఇతను మహబూబాబాద్ జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల బాధిత బాలిక తన నివాసం సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో వున్న నిందితుడు రమేశ్ ఆమెను చూశాడు. ఆపై బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేధించాడని బాలిక బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. వీరిని గమనించిన నిందితుడు రమేష్ అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో బాధిత బాలిక కొన్నాళ్లుగా బంధువుల వద్ద వుంటోంది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు డోర్నకల్ పోలీసులు రమేశ్పై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై మహబూబాబాద్ డీఎస్పీ టీ.సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు రమేశ్ మైనర్ బాలికపై బలవంతంగా లైంగిక దాడికి ప్రయత్నించాడని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రమేశ్ను అరెస్ట్ చేశామని చెప్పారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. నిందితుడిపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు.