ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఈరోజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు అడిగిన వివరాలను శేఖర్ రెడ్డి సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లోని పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోదాలు ముగించిన అనంతరం విచారణకు రావాల్సిందిగా పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే పైళ్ల శేఖర్ రెడ్డి ఈరోజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, ఇటీవల పైళ్ల శేఖర్ రెడ్డితో పాటు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఒకరోజు ఐటీ అధికారులు సోదాలు జరపగా.. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించారు.
అయితే ఈ సోదాలు కక్షపూరితమైనవని నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంలో శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన ఇమేజీ డ్యామేజ్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.
‘‘మూడు రోజులుగా ఐటీ సోదాలపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కొన్ని నివేదికలు ఐటీ అధికారులు నా ఇంట్లో, నా బంధువుల ఇళ్లలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, నేను దక్షిణాఫ్రికాలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నానని పేర్కొన్నాయి. ఈ కథనాలలో నిజం లేదు’’ అని పేర్కొన్నారు.