బిఆర్ఎస్ ఏడో వికెట్ డౌన్ ... కాంగ్రెస్ గూటికి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

పదేళ్లపాటు ఎదురన్నదే లేకుండా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన బిఆర్ఎస్ ఒక్క ఓటమితో చతికిల పడింది. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీ పరిస్థితి అద్వాన్నంగా మారింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగగా తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు... 

BRS MLA Bandla Krishnamohan Reddy Joined in Congress Party AKP

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హ్యాండివ్వగా తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా జంప్ అయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరారు. 

 

అయితే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆమెకు సర్దిచెప్పిన సీఎం ఎమ్మెల్యే చేరికకు లైన్ క్లియర్ చేసారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. 

ఇప్పటివరకు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు వీరే : 

తెలంగాణలో మొత్తం అసెంబ్లీ సీట్లు 119...  అంటే 60 పైచిలుకు సీట్లు ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇది పెద్ద మెజారిటీ ఏం కాదు... ఏ కొందరు ఎమ్మెల్యేల మనసు మారినా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం వుంటుంది. దీంతో పార్టీ బలాన్ని పెంచుకునే పడ్డారు సీఎం రేవంత్ ... అందులో భాగమే ఈ ఆపరేషన్ ఆకర్ష్.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు కొందరు... తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీని వీడారు. ఇలా ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించారు. 

బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరుంది.  అలాంటిది ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటేనే బిఆర్ఎస్ పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే  తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య,  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు కూడా కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వీరి బాటలోనే నడిచారు... ఆయన చేరికతో బిఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి చేరిన శాసనసభ్యుల సంఖ్య ఏడుకు చేరింది.  

కాంగ్రెస్ లో మూకుమ్మడిగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు..: 

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీలు... ఇలా వాళ్లువీళ్లని కాదు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్ బాట పట్టారు. ఇటీవల ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అటు అసెంబ్లీతో పాటే ఇటు మండలిలోనూ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బిఆర్ఎస్ భారీగా పిరాయింపులకు ప్రోత్సహిస్తోంది. తాజాగా కాంగ్రెస్ లోకి దండె విఠల్, ఎం.ఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య,యెగ్గె మల్లేశం, దయానంద్ లు ఒకేసారి చేరారు.  ఇక ఇప్పటికే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరైన విషయం తెలిసిందే.


 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios