బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్ధుల తొలి జాబితాలో స్థానం దొరక్కపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితా ప్రకటించారు. 115 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను తెలంగాణ భవన్‌లో వెల్లడించారు. అయితే పనితీరు మెరుగ్గా లేని ఏడుగురు సిట్టింగ్‌లను పక్కనబెట్టారు. ఇక ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని భావించిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కేసీఆర్ షాకిచ్చారు. ఆయన పోటీ చేయాలని భావించిన ఖమ్మం, పాలేరులలో పువ్వాడ అజయ్ కుమార్, కందాళ ఉపేందర్ రెడ్డిలకు టికెట్ కన్ఫర్మ్ చేశారు సీఎం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ పరిణామాలతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర నిరాశకు గురయ్యారు. తన రాజకీయ జీవితంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆహ్వానాలు అందాయి. కానీ దీనిపై తుమ్మల వేచి చూసే ధోరణిలో వున్నారు. సోమవారం అభ్యర్ధుల జాబితా చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని తుమ్మల నిర్ణయించారు. ఇప్పుడు కేసీఆర్ మొండిచేయి చూపడంతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

ALso Read: Telangana assembly elections 2023: బీజేపీ గూటికి తుమ్మల..? చేరిక ఆ రోజేనా..?

అయితే బీజేపీలో చేరేందుకు తుమ్మల నాగేశ్వరరావు రెండు కండీషన్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. తనతో పాటు మానే రామకృష్ణకు టికెట్ ఇవ్వాలనే హామీ మేరకు ఆయన బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 27న ఖమ్మంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. 

గతంలో పాలేరు నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ తరఫున తుమ్మల పోటీ చేసినా.. గెలుపును కైవసం చేసుకోలేకపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేత ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే..కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఉపేందర్ రెడ్డి కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ లోనే చేరిపోయారు. దీంతో తుమ్మల ప్రాధాన్యం కాస్త తగ్గిందని పొలిటికల్ టాక్.