జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ.. అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు..
జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ తగిలింది. ఉప్పల్ చిలుకానగర్ డివిజన్లో పర్యటిస్తున్న ఆమెను సొంతపార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ తగిలింది. ఉప్పల్ చిలుకానగర్ డివిజన్లో పర్యటిస్తున్న ఆమెను సొంతపార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మేయర్ ప్రొటోకాల్ పాటించడం లేదని, స్థానిక ఎమ్మెల్యే లేకుండా చిలుకానగర్ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మేయర్కు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మేయర్ గో బ్యాక్.. గో బ్యాక్.. అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కార్యక్రమం పెడదామని ఎమ్మెల్యేనే చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. ఇందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని.. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్యే తనకేంటి సంబంధం అనే విధంగా సమాధానం చెప్పారు. ప్రోటోకాల్తో తనకు సంబంధం లేదని.. అది అధికారుల పని అంటూ మేయర్ విజయలక్ష్మి అన్నారు.