ప్రమాదంలో తమ్ముడి మరణం.. ఆసుపత్రికి వెళ్తుండగా అన్నకి యాక్సిడెంట్: గంట వ్యవధిలో సోదరుల మృతి
వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే రోజు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముని మరణవార్త తెలిసిన అన్న వస్తుండగా అతను కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే రోజు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముని మరణవార్త తెలిసిన అన్న వస్తుండగా అతను కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన మల్ల వేణి రాజు పెద్దూరు నుండి కామారెడ్డి వైపు వెళ్లే దారిలో సర్దాపూర్ పోలీస్ బెటాలియన్ వద్ద కంటైనర్ లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సంఘటనా స్థలంలో తన వాహనాన్ని ఆపి వెంటనే అతనిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు. కానీ తీవ్ర గాయాలు కావడంతో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Also Read:కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
తమ్ముని మరణవార్త తెలుసుకున్న అతని అన్నయ్య మల్లవేణి నర్సయ్య వెంకటాపూర్ నుండి హుటాహుటిన సిరిసిల్ల బయల్దేరాడు. ఈ క్రమంలో అతన్ని కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో నర్సయ్య కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఒకేరోజు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు గ్రామస్తులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ మానవత్వంతో రాజుని బ్రతికించడానికి ప్రయత్నించినా అతని ప్రాణం దక్కలేదు.