వేరొకరితో సంబంధం పెట్టుకుందని: చెల్లిని నరికిన అన్న
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో దాడి చేశాడు.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. చందంపేట మండలం రూప్లతండాకు చెందిన కేతావత్ జామ్ల, రూక్మా దంపతుల రెండవ కుమార్తె చిట్టికి 8 ఏళ్ల క్రితం నాగర్కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
రెండేళ్లు వీరి కాపురం సజావుగానే జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటూ కూలి పనులు జీవనం కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో మురుపునూతల గ్రామానికి చెందిన బాల్రెడ్డితో చిట్టికి వివాహేతర సంబంధం ఏర్పడింది. సోమవారం సాయంత్రం వీరిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని చిట్టి వదిన బుజ్జి చూసింది.
ఈ విషయాన్ని ఆమె తన భర్త మంగ్లా కు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన మంగ్లా కత్తి తీసుకుని అప్పుడే ఇంటికి చేరుకున్న చెల్లెలిపై దాడి చేశాడు. ఆమె తీవ్ర గాయాలతో కుప్పకూలింది.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని దేవరకొండలోని ఆసుపత్రికి తరలించారు. మంగ్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.