వరంగల్లో విషాదం.. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని బాలుడి మృతి..
వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని 8 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.
వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని 8 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. వివరాలు.. రాజస్తాన్కు చెందిన కన్గహాన్ సింగ్ వరంగల్లో నివాసం ఉంటున్నాడు. అతడికి స్థానికంగా ఎలక్ట్రికల్ షాపు ఉంది. అతడిని భార్య గీత, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. పిల్లలు పిన్నవారి వీధిలో శారదా పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. రోజు మాదిరిగానే శనివారం కన్గహాన్ సింగ్ పిల్లలను స్కూల్ వద్ద దింపాడు.
అయితే స్కూల్కు బయలుదేరే సమయంలో ఇటీవల విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్స్ను తల్లి వారికి ఇచ్చింది. అయితే కన్గహాన్ సింగ్ రెండో కొడుకు సందీప్ చాక్లెట్ తింటూ స్కూల్లోకి అడుగుపెట్టాడు. స్కూల్లో మొదటి అంతస్తులోని తన క్లాస్ రూమ్కి చేరుకున్నాడు. అయితే కాసేపటికే సందీప్ క్లాస్ రూమ్లో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో స్కూల్ యజమాన్యం సందీప్ తండ్రికి సమాచారం ఇచ్చింది. మరోవైపు బాలుడిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి గొంతులో చాక్లెట్ ఇరుక్కొన్నట్టుగా గుర్తించారు.
అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతూ సందీప్ మరణించాడు. గొంతులో చాక్లెట్ ఇరుక్కొవడంతో శ్వాస అందక సందీప్ చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో సందీప్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.