వర్షాలు , వరదల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే షకీల్ (trs mla shakeel) , బీజేపీ (bjp) ఎంపీ ధర్మపురి అర్వింద్ (dharmapuri arvind) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అర్వింద్ ఎక్కడున్నారని షకీల్ నిలదీశారు. సీఎం కేసీఆర్ ను విమర్శించడం తప్పించి ఆయన వేరే పని లేదా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం తప్పించి.. కేంద్రం నుంచి తెలంగాణకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని షకీల్ దుయ్యబట్టారు. ఇంతటి క్లిష్ట పరిస్ధితుల్లో ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతోన్న అర్వింద్ ను చెప్పుతో కొట్టాలంటూ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంపీ అర్వింద్ స్పందిస్తూ.. పందిని పట్టించుకోనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపితే కేంద్రం సాయం చేస్తుందని.. కేసీఆర్ ప్రభుత్వానికి ఆ పని చేతకాదంటూ ఎద్దేవా చేశారు.
Also REad:రైతులపై కపట ప్రేమే, అంతా గమనిస్తున్నారు.. కేసీఆర్కు కర్రు కాల్చి వాత తప్పదు : విజయశాంతి
ఇకపోతే.. వర్షాలు దంచికొడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్లు ఆరోపణలు, విమర్శల దాడులతో రెచ్చిపోతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ మరింత దూకుడును పెంచింది. సమయం దొరికినప్పుడల్లా రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర బీజేపీ అగ్రనాయత్వం సైతం అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల, తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్మ్యాప్ను సిద్ధం చేసిందని సమాచారం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. జులై 21 నుంచి 'పల్లె గోస-బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ 15 ప్రాంతాల్లో మోటార్ సైకిల్ యాత్ర చేపట్టనుంది. దీనిలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ "2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సిద్ధమైందని, బూత్ స్థాయిలో బలోపేత కార్యక్రమం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణకు 30 మంది కేంద్ర మంత్రులు కూడా రానున్నారు" అని తెలిపారు. .
