దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్కి బీజేపీ షాక్, టీఆర్ఎస్ కు దెబ్బేనా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయనుందనే సంకేతాలను దుబ్బాక ఉఫ ఎన్నికల ఫలితాలు ఇచ్చాయి. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. పీసీసీ చీఫ్ ను మార్చాలనే డిమాండ్ కూడ చాలా కాలంగా కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయనుందనే సంకేతాలను దుబ్బాక ఉఫ ఎన్నికల ఫలితాలు ఇచ్చాయి. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. పీసీసీ చీఫ్ ను మార్చాలనే డిమాండ్ కూడ చాలా కాలంగా కొనసాగుతోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. 2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడ ఆ పార్టీకి నష్టం చేసింది.
టీపీసీసీ చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని కూడ చాలా కాలంగా డిమాండ్ నెలకొంది. ఈ పదవి నుండి తప్పుకొంటానని కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ జాతీయనాయకత్వాన్ని కోరారు. కానీ ఆయనను పీసీసీచీఫ్ పదవి నుండి తప్పించలేదు.
2019 పార్లమెంట్ ఎన్నికల నుండి రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలను చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ కు బీజేపీ సవాల్ విసిరింది.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ నాయకత్వం ఒంటికాలిపై విమర్శలు చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వాన్ని కూడ మార్చింది.
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే బండి సంజయ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కొందరు నేతలు సంజయ్ కు ఈ బాధ్యతలను అప్పగించడాన్ని వ్యతిరేకించినా కూడ పార్టీ నాయకత్వం ఏమాత్రం తగ్గలేదు.బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా కార్యక్రమాలను చేపట్టారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందనే రీతిలో కేసీఆర్ ను బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు.ఈ గేమ్ ప్లాన్ లో బీజేపీ సక్సెస్ అయింది. ఈ గేమ్ లో కాంగ్రెస్ వెనుకబడింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బీజేపీ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ప్రచారం చేసింది.
బీజేపీని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కాంగ్రెస్ ఎక్కడా కూడ ప్రచారంలో లేకుండా పోయింది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.
also read:ఓటమికి బాధ్యత వహిస్తున్నా: దుబ్బాక బైపోల్ రిజల్ట్స్ పై హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఈ ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చింది. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే మకాం వేసినా కూడ ఆ పార్టీకి ఆశించిన ఓట్లు దక్కలేదు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్వంత మండలంలో మినహా ఇతర మండలాల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఓట్లు దక్కలేదు.
టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పడింది.దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి షిఫ్ట్ కావడం.. కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం చేస్తోంది.
టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమని భావించి బీజేపీకి టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే జరిగే జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.