జూలై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

జూలై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సభ నిర్వహణ కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌ను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. కాగా, జూన్ 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల కోసం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. 

ఈ సమావేశాలను హైటెక్స్ ప్రాంగణంలోని నోవాటెల్‌లో జరపాలని నిర్ణయించినట్టుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు.. ఈ సమావేశాలు తెలంగాణలో నిర్వహించడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని.. ఇది ఈ ప్రాంతంపై బీజేపీకి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. జాతీయ సమావేశాలకు వచ్చే నేతలకు.. హైదరాబాద్‌లో ఉంటున్న వారి రాష్ట్రాలకు చెందిన ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. చివరి రోజు మూడో తేదీన బహిరంగ సభను నిర్వహించనున్నట్టుగా తెలిపారు.