నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక...సీరియస్గా తీసుకోండి, బీజేపీ నేతలతో సునీల్ బన్సల్
నవంబర్ మొదటి లేదా రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక వుండే అవకాశం వుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీ సునీల్ బన్సల్. ఎన్నికను అందరూ సీరియస్గా తీసుకోవాలని సునీల్ బన్సాల్ సూచించారు.
నవంబర్ మొదటి లేదా రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక వుండే అవకాశం వుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీ సునీల్ బన్సల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుస్తుందని సునీల్ ధీమా వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్లు మునుగోడులోనే వుండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికను అందరూ సీరియస్గా తీసుకోవాలని సునీల్ బన్సాల్ సూచించారు.
కాగా... బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా సునీల్ బన్సల్ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పార్టీ ఇంచార్జీ బాధ్యతలను కూడ సునీల్ బన్సల్ కు జాతీయ నాయకత్వం అప్పగించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బాధ్యతల నుండి రిలీవ్ అయిన తర్వాత మూడు రాష్ట్రాల బాధ్యతలను బన్సల్ కు అప్పగించింది జాతీయ నాయకత్వం. 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో అమిత్ షా కు సునీల్ బన్సల్ సహ ప్రముఖ్ గా పనిచేశారు.
2014 ఎన్నికల్లో యూపీ నుండి బీజేపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. యూపీలో మంచి ఫలితాలు రావడంతో సునీల్ బన్సల్ ను తెలంగాణకు ఇంచార్జీగా నియమించింది బీజేపీ నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై సునీల్ బన్సల్ కీలక పాత్ర పోషించనున్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో సునీల్ బన్సల్ దిట్టగా పేరుంది. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితుల ఆధారంగా సునీల్ బన్సల్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు.
ALso Read:మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు.. నవంబర్ రెండో వారంలో పోలింగ్..?
ఇకపోతే.. మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకపోయినప్పటికీ.. ఈ ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నికను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.
ఆగస్టు 8వ తేదీన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అదే రోజు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇక, నిబంధనల ప్రకారం.. ఆరు నెలలు అంటే ఫిబ్రవరి 8వ తేదీలోపు మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే నవంబర్లోనే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.