గోదావరి వరదలకు క్లోడ్ బరస్ట్ కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. 

హైదరాబాద్: Godavari వరదల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి KCR డ్రామాలాడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay విమర్శించారు. Cloud Burst పేరుతో విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.తెలంగాణలో భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమదన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తే సీఎంకు మతి భ్రమించినట్లుందనిపిస్తుందన్నారు. సీఎంకు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయన్నారు.. కానీ ఈ దఫా వచ్చిన వరదల వెనుక వీదేశీ కుట్ర అనడాన్ని ఆయన తప్పు బట్టారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు. 

భద్రాచలంలో10 వేల ఇండ్లతో కాలనీ, గోదావరిపై కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ వంచించే హామీలను కేసీఆర్ ఇచ్చారన్నారు. కేసీఆర్ తప్పిదాలవల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందన్నారు. ఈ విషయమై ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని బండి సంజయ్ ఆరోపించారు. 

వారం రోజులుగా వరదలతో జనం అల్లాడుతుంటే సీఎం పట్టించుకోలేదన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో రివ్యూలు చేస్తూ కేంద్రాన్ని బదనాం చేయడానికే పరిమితం చేస్తున్నారని బండి సంజయ్ కేసీఆర్ పై మండిపడ్డారు. వరద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.

కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందన్నారు. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని బండి సంజయ్ విమర్శించారు. 

హైద్రాబాద్ లో వరద బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ దేనని బండి సంజయ్ గుర్తు చేశారు. అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇస్తా... ఇంటింటికో ఉద్యోగం ఇస్తా... దళితుడిని సీఎంను చేస్తానన్న హామీల మాదిరిగానే భద్రాచలంలో ముంపు బాధితులకు ఇళ్ల నిర్మాణం కూడా మిగిలిపోనుందన్నారు.