'ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం మీతరం కాదు'
దేశరాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మరల్చడానికే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు.
దేశరాజధాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మరల్చడానికే బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. బండి సంజయ్ ని పాదయాత్ర శిబిరం నుంచి అరెస్ట్ చేసి, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని, చివరకు తిప్పితిప్పి కరీంనగర్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అవినీతి, అసమర్థతపై ప్రశ్నిస్తున్నందుకే బండి సంజయ్ పాదయాత్రను ఆపివేశారని, బండి సంజయ్ ను అప్రజాస్వామికంగా, అక్రమంగా, అరాచకంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని రాణి రుద్రమ తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల దాడిని నిరసిస్తూ బండి సంజయ్ తో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా దీక్ష చేస్తున్నవారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ మాఫీయా లో ప్రధాన పాత్ర పోషించారని ఢిల్లీ ఎంపీ ఆరోపణలు చేశారనీ, కవిత బంధువులు, వారి అనుచరులలో 8 మందిని సీబీఐ... ED కి అటాచ్ చేసారని ఢిల్లీ ఎంపీ చెప్పారని తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడి, అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలను ఖండించి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా.. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీ కార్యకర్తపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారనీ, మూడు సార్లు సెక్షన్స్ మార్చి, హత్యాయత్నం కేసులు పెట్టారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. బీజేపీ కార్యకర్తలపై అట్టెంప్టు మర్డర్ కేసులు పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
తెలంగాణలో సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందనీ, మన రాష్ట్రంలో రూపొందించిన లిక్కర్ పాలసీని ఢిల్లీలో కూడా అమలు చేయాలని చూడడం సిగ్గుచేటని, దేశాన్ని మొత్తం లిక్కర్ మాఫియా చేయాలని చూస్తున్నారని రాణి రుద్రమ ఆరోపించారు. పోలీసు యంత్రాంగాన్ని.. అధికార తెరాస చెప్పుచేతల్లో పెట్టుకున్నందనీ, ఇన్నాళ్లుగా సాగిన పాదయాత్రను ఎందుకు పోలీసులు అడ్డుకోలేదనీ, ఇప్పుడే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని నిలాదీశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడుతోంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.