టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అవమానిస్తోంది: బీజేపీ నేత లక్ష్మణ్
కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. పరీక్ష రాయడానికి వచ్చిన మహిళా అభ్యర్థులను పుస్తెలు, మెట్టెలు తియ్యమనడం హిందూ సంస్కృతిని అవమానించడమేనని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఉద్యమ పార్టీ అని నమ్మి టీఆర్ఎస్కు ఓట్లేస్తే ఎలాంటి కారణం లేకుండా తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు శాంపిల్స్ కట్టి 2 లక్షల ఇండ్లు కట్టినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 27న 20వేల మంది మహిళలతో సమ్మేళనం నిర్వహిస్తామని లక్ష్మణ్ ప్రకటించారు. ఈ సమ్మేళనంలో స్మృతీ ఇరానీ పాల్గొంటారని తెలిపారు.